టీజీఎస్ఆర్టీసీలో కీలక నిర్ణయాలు: జూలై 1 నుంచి 11 శాతం ఫిట్మెంట్ అమలు – భవిష్యత్ కార్యాచరణపై సమీక్ష
హైదరాబాద్,వి90న్యూస్,జూన్ 18: ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు పూర్తయిన సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ పురోగతి , భవిష్యత్ కార్యాచరణపై ఉన్నతాధికారులతో ప్రభుత్వం కీలక సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశంలో ఆర్టీసీ సంస్థను బలోపేతం చేసే దిశగా , ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పలు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకున్నారు.ఆర్టీసీ సమ్మె సమయంలో ఇచ్చిన హామీ మేరకు, ఆర్పీఎస్-2021కి సంబంధించి 11 శాతం ఫిట్మెంట్ను జూలై 1వ తేదీ నుండి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో పాటు ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు వీలుగా, ఎన్నికల షెడ్యూల్ను త్వరలోనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది.

మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా నాగర్కర్నూల్ , పెద్దపల్లి డిపో పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే, కొత్తగా మంజూరైన బస్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని ఆదేశించారు. ఆర్టీసీ ఉద్యోగి శంకర్ దురదృష్టవశాత్తూ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో, ఆయన కుటుంబానికి ప్రభుత్వం అందించే రూ. 1 కోటి చెక్కు, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం , ఇందిరమ్మ ఇల్లు అందించే ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.ప్రజా రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా, త్వరలోనే దక్షిణ భారత రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు , ఆర్టీసీ ఎండీలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి, రవాణా రంగ అభివృద్ధిపై సమగ్ర చర్చలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

