కూటమి రెండేళ్ల పాలనలో ‘స్వర్ణాంధ్ర’ దిశగా అడుగులు: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
ఆంధ్రప్రదేశ్/కొత్తపేట,వి90 న్యూస్,జూన్ 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విధ్వంసం నుండి వికాసం వైపు, సంక్షోభం నుండి ప్రగతి వైపు పయనిస్తూ రూపురేఖలు మార్చుకుంటోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్రిముఖ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆయన స్పష్టం చేశారు. కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

అంతకుముందు సుబ్బరాజు కళ్యాణ మండపం నుండి మహిళా కార్యకర్తలతో కలిసి భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే, అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాల స్టాల్స్ను సందర్శించి లబ్ధిదారులతో ముచ్చటించారు.2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ప్రజల నమ్మకాన్ని గెలుచుకుందని ఎమ్మెల్యే సత్యానందరావు కొనియాడారు. తల్లికి వందనం, స్త్రీ శక్తి, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా వంటి పథకాలతో పాటు అమరావతి నిర్మాణం, అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణతో ప్రతి పౌరుడు గర్వపడేలా పాలన సాగుతోందన్నారు.

ఇదే నెలలో ‘అన్నదాత సుఖీభవ’, ‘తల్లికి వందనం’ నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానున్నాయని ఆయన వెల్లడించారు. కొత్తపేట నియోజకవర్గ పరిధిలో లొల్ల లాకుల ఆధునికీకరణ, వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి, దేవరపల్లి ఎంఎస్ఎంఈ పార్క్, ఏనుగుమహల్ సబ్స్టేషన్, బడుగువానిలంక నది తీర రక్షణ గ్రోవెల్స్ నిర్మాణం, 36 విలేజ్ హెల్త్ క్లినిక్ల ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి పనులను వేగవంతం చేశామని వివరించారు. ఈ సందర్భంగా కూటమి పార్టీల ముఖ్య నాయకులతో కలిసి ఆయన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

