జమ్మికుంటలో నిబంధనలు ఉల్లంఘించిన షాపులపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 19: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో శుక్రవారం నాడు పోలీసులు ఒక్కసారిగా తనిఖీలు చేపట్టడంతో స్థానికంగా కలకలం రేగింది. కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌస్ ఆలం జారీ చేసిన ప్రత్యేక ఉత్తర్వుల మేరకు, హుజురాబాద్ ఏసీపీ ప్రత్యక్ష పర్యవేక్షణలో జమ్మికుంట పట్టణ పోలీసు బృందాలు ఈ విస్తృత సోదాలు నిర్వహించాయి. ముఖ్యంగా పట్టణంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల పరిసర ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యాసంస్థలకు వంద మీటర్ల లోపు ఎలాంటి పొగాకు ఉత్పత్తులు, మద్యం లేదా ఇతర నిషేధిత పదార్థాల విక్రయాలు జరపకూడదనే నియమం ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల పాన్ షాపులు , బెల్ట్ షాపులు యథేచ్ఛగా నడుస్తున్నట్లు వచ్చిన సమాచారంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ ఆకస్మిక తనిఖీల్లో భాగంగా పాఠశాలల సరిహద్దులకు వంద మీటర్ల లోపు ఉన్న ప్రతి పాన్ షాపును, అనుమానాస్పదంగా ఉన్న బెల్ట్ షాపులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థుల భవిష్యత్తును పాడుచేసేలా, వారిని తప్పుడు మార్గాల వైపు మళ్లించేలా పాఠశాలల చెంతనే ఇటువంటి వ్యాపారాలు నిర్వహించడంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాబోయే రోజుల్లో కూడా విద్యాసంస్థల పరిసరాల్లో ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలను బేఖాతరు చేస్తూ చట్టవిరుద్ధంగా షాపులు నడిపేవారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులు గట్టిగా హెచ్చరించారు. వ్యాపారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విద్యార్థుల చదువుకు, ఆరోగ్యానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

