జమ్మికుంట శివాలయంలో సోమవారం వరుణ పాశుపత మహా అభిషేకం: భక్తులకు ఆహ్వానం
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 27: స్థానిక జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం (బొమ్మల గుడి) శివాలయంలో సోమవారం (29-06-2026) ఉదయం 6:00 గంటలకు వరుణ పాశుపత మహా అభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్( దిలీప్) ప్రత్యేక పర్యవేక్షణలో, అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో భవాని భజన మండలి వారి సహకారంతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం జరగనుంది.

లోకకల్యాణార్థం, వర్షాలు సమృద్ధిగా కురవాలని సంకల్పిస్తూ నిర్వహించే ఈ వరుణ పాశుపత మహా అభిషేకానికి నియోజకవర్గంలోని శివభక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులందరికీ ఆలయ ప్రధాన అర్చకులు మండలేముల వేణుగోపాల్ శర్మ చేతుల మీదుగా ప్రత్యేక తీర్థప్రసాదాల వితరణ జరుగుతుంది. అనంతరం అన్నపూర్ణ సేవా సమితి వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ (అన్నదానం) కార్యక్రమం కొనసాగుతుంది. కావున భక్తులందరూ ఈ మహోత్సవంలో పాల్గొని, స్వామివారి కృపకు పాత్రులై, అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

