మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష: నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని ఆదేశం
హైదరాబాద్,వి90న్యూస్,జూన్ 27 : మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటి దశ పురోగతిపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో జరిగిన ఈ కీలక సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి , ఎంపీ వేం నరేందర్ రెడ్డి , ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మూసీ మొదటి దశ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రికి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను వివరించారు. ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మూసీ రివర్బెడ్లో ఉన్న నిర్వాసితులకు తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించాలని అధికారులను ఆదేశించారు.

అలాగే, ప్రాజెక్టులో భాగంగా అవసరమైన చోట భూ సేకరణ కోసం ఆసక్తి ఉన్న భూయజమానులకు టీడీఆర్ (TDR) ఇవ్వాలని లేదా తగిన పరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు.మరోవైపు, గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ నుంచి తీసుకుంటున్న భూముల్లో ఉన్న నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వమే సురక్షితంగా తరలించాల్సి ఉంటుందని ఈ సమావేశంలో నిర్ణయించారు. దీనితో పాటు, నెక్లెస్ రోడ్డులో ప్రజల సందర్శనార్థం ప్రత్యేకంగా ‘మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్’ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. మూసీ ప్రాజెక్టులో భాగంగా భవిష్యత్తులో చేపట్టబోయే పనులన్నింటినీ ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్లో ప్రతిబింబించేలా తీర్చిదిద్దాలని, అదే సమయంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై ప్రజల నుంచి సానుకూల అభిప్రాయాలను, సూచనలను కూడా సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

