ఇల్లందకుంట తహశీల్దార్ నూతన కార్యాలయ భవనానికి నిధులు మంజూరు
కరీంనగర్/ఇల్లందకుంట,వి90 న్యూస్,జూన్ 28: ఇల్లందకుంట మండల కేంద్రంలో తహశీల్దార్ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

స్వరాష్ట్రం ఏర్పడిన అనంతరం అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా 10 ఆర్డీఓ కార్యాలయ భవనాలతో పాటు, 107 తహశీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణానికి నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఒక ప్రకటనలో తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఇల్లందకుంటలో నూతన భవన నిర్మాణంతో నిత్యం వివిధ పనుల నిమిత్తం తహశీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ నిధుల మంజూరుపై స్థానిక ప్రజలతో పాటు ప్రణవ్ బాబు సంతోషం వ్యక్తం చేస్తూ, రాబోయే రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఇతర సమస్యలను కూడా ఇదే తరహాలో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

