చలో కొడంగల్ కార్ ర్యాలీకి కరీంనగర్ నుండి కదిలిన ఉద్యమకారులు: జిల్లా అధ్యక్షుడు ఎక్కడ సంజీవరెడ్డి
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 28: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన చలో కొడంగల్ కార్ ర్యాలీ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా నుండి భారీ స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుండి ఉద్యమకారులు సుమారు 20 కార్ల ద్వారా ఈ ర్యాలీకి తరలివెళ్లారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు ఎక్కడ సంజీవరెడ్డి మాట్లాడుతూ.. చేవెళ్ల నుండి కొడంగల్ వరకు సాగే ఈ ఉత్సాహభరిత ర్యాలీలో పాల్గొనేందుకు తరలివచ్చిన ఉద్యమకారులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుల కోసం కేకే కమిటీని ఏర్పాటు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. నాలుగు ముఖ్యమైన అంశాలపై స్పష్టమైన జీవో కూడా జారీ కావడం సంతోషకరమని, అయితే ఈ కమిటీ కాలయాపన లేకుండా నిర్ణీత గడువులోగా తన నివేదికను అమలు చేసేలా చూడాలని కోరారు. ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపేందుకు కొడంగల్లో భారీ కృతజ్ఞత సభను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మూడేళ్ల కుమార్ స్వామి, కాన్స్టెన్సీ ఇంచార్జ్ ఆరే రమేష్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు మద్దూరు శంకరయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ నర భూమిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పాతకాల ఓదెలు, ఎజ్జ తిరుపతి, కోశాల వెంకన్నతో పాటు పలువురు ముఖ్య నాయకులు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

