మడిపల్లిలో విలేకరుల ఆధ్వర్యంలో ఘనంగా మొహరం ధూంధాం
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 28: మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం (పీరీల) పండుగను పురస్కరించుకొని మడిపల్లి గ్రామ విలేకరుల ఆధ్వర్యంలో కళాకారులచే నిర్వహించిన ఆటపాట ధూంధాం కార్యక్రమం గ్రామ బస్టాండ్ వద్ద అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎన్నారై డాక్టర్ నేరెళ్ల దామోదర్ (యూఎస్ఏ) మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని, కులమత ప్రాంత భేదాలకు అతీతంగా ప్రజలంతా సోదరభావంతో కలిసిమెలిసి జీవించాలని ఆయన పిలుపునిచ్చారు.
పుట్టిన ఊరిని, ఇక్కడి సంస్కృతిని తాను ఎప్పటికీ మరువలేనని చెప్పిన డాక్టర్ దామోదర్, మడిపల్లిలో మతసామరస్యానికి ప్రతీకగా మొహరం పండుగను ఇంత ఘనంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. గ్రామ విలేకరులు బాధ్యతాయుతమైన జర్నలిజంతో పాటు, ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలను ముందుండి నడిపించడం అభినందనీయమని కొనియాడారు. ఈ గ్రామంలో పుట్టిన బిడ్డగా, తన తల్లిదండ్రులను స్మరిస్తూ గ్రామాభివృద్ధికి, కళలను ప్రోత్సహించడానికి ఎల్లప్పుడూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు వీలుగా సీసీ కెమెరాల ఏర్పాటుకు అయ్యే ఖర్చులో సగాన్ని భరిస్తానని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. అలాగే గ్రామంలోని స్మశాన వాటిక అభివృద్ధికి, నిరుపేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు, పేద ప్రజల వైద్య సహాయానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం ఎన్నారై డాక్టర్ నేరెళ్ల దామోదర్ను ప్రజాప్రతినిధులు, విలేకరుల బృందం ఘనంగా సన్మానించింది.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మ్యాకమల్ల తిరుమల-వెంకటేష్, ఉపసర్పంచ్ కస్తూరి శ్రీనాథ్, ఏఎంసీ డైరెక్టర్ ఎగ్గేటి సదానందం, విలేకరులు ఒగ్గు రమేష్, ఎండి నసీరుద్దీన్, ఆoబాల ప్రభాకర్ (ప్రభు), బోనగాని యాదగిరి, నేరెళ్ల రఘుపతి, గంగారపు రఘుబాబు, ఎండి అంకుష్, అంబాల శ్రీరామ్ పాల్గొన్నారు. అలాగే కళాకారులు వడ్లకొండ అనిల్, శనిగరపు బాబ్జి, తుమ్మనపల్లి రాజు, రామంచ భరత్, యాకూబ్, దొగ్గల శ్రీధర్, మిట్టపల్లి బాలు, సంధ్య, రజిత, మంద జగన్, మారముల ప్రభు, గంగారపు రాజయ్యతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

