ఇల్లంతకుంట నూతన తహసిల్దార్ కార్యాలయ భవనానికి నిధులు మంజూరు: దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు
కరీంనగర్/ఇల్లందకుంట,వి90 న్యూస్,జూన్ 28: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పాటైన ఇల్లందకుంట మండలానికి నూతన తహసిల్దార్ కార్యాలయ భవన నిర్మాణ నిధులు మంజూరైనట్లు శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. మండలం ఏర్పడి దాదాపు పది సంవత్సరాలు కావస్తున్నప్పటికీ సొంత భవనం లేకపోవడంతో, ఇప్పటివరకు శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి సంబంధించిన కళ్యాణమండపంలో ఎమ్మార్వో ఆఫీస్, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం గెస్ట్ హౌస్లో పోలీస్ స్టేషన్ కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. నియోజకవర్గంలో ఊకదంపుడు ముచ్చట్లు చెప్పే కౌశిక్ రెడ్డికి మాటలు తప్ప చేతలు చేతకావని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు.హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వోడితల ప్రణవ్ బాబు ప్రత్యేక చొరవ తీసుకొని నూతన తాసిల్దార్ భవనానికి నిధులు మంజూరు చేయించారని, అందుకు గాను ఇల్లంతకుంట మండలంలోని 18 గ్రామాల ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రణవ్ బాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 10 ఆర్టీవో ఆఫీస్ లు, 107 నూతన తాసిల్దార్ భవనాలను మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, బీసీ సంక్షేమ , రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు, ఐటీ , శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు, అలాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తలు గొడిశాల పరమేష్, గోలి కిరణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మారపల్లి సాగర్ తదితరులు పాల్గొన్నారు.

