జమ్మికుంట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా లెంకలపల్లి శరత్ కుమార్ ఘన విజయం
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 28: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో నిర్వహించిన ఎన్నికల్లో జమ్మికుంట ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా లెంకలపల్లి శరత్ కుమార్ ఘన విజయం సాధించారు. మొత్తం 1800 మంది ఓటర్లు ఉన్న జమ్మికుంట ఆర్యవైశ్య సంఘంలో నిర్వహించిన ఈ పోలింగ్లో 792 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆర్యవైశ్య కన్వీనర్ల ఆధ్వర్యంలో, స్థానిక జమ్మికుంట పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఈ ఎన్నికల ప్రక్రియ ముగిసింది.పట్టణ అధ్యక్ష పదవి కోసం నలుగురు అభ్యర్థులు పోటీ పడగా, హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో లెంకలపల్లి శరత్ కుమార్కు 461 ఓట్లు లభించాయి. అలాగే ఆయన సమీప ప్రత్యర్థి రావికంటి మధుకు 319 ఓట్లు, మరో అభ్యర్థి రావికంటి దామోదర్కు 09 ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో లెంకలపల్లి శరత్ కుమార్ తన ప్రత్యర్థులపై 142 ఓట్ల భారీ మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. విజయం సాధించిన శరత్ కుమార్కు ఆర్యవైశ్య సంఘం కన్వీనర్లు అధ్యక్ష పదవి ధ్రువీకరణ పత్రాన్ని అధికారికంగా అందజేశారు. ఈ ఎన్నికల ప్రక్రియ అంతటా శాంతిభద్రతలను కాపాడుతూ, రక్షణ కవచంగా నిలిచిన జమ్మికుంట పట్టణ సీఐతో పాటు పోలీస్ సిబ్బందికి ఆర్యవైశ్య సంఘ సభ్యులు, నాయకులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

