జమ్మికుంటలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 28: నిండు జీవితానికి రెండు చుక్కలు అనే నినాదంతో దేశవ్యాప్తంగా చేపట్టిన నేషనల్ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట పట్టణంలో పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. జమ్మికుంట బస్టాండ్ ఆవరణం, పాత మున్సిపల్ కార్యాలయంతో పాటు పట్టణంలోని పలు ప్రాంతాలలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ముఖ్య అతిథిగా హాజరై చిన్నార్లకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అప్పుడే పుట్టిన చంటిపిల్లల నుండి ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్క చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు.

ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన పోలియో బూత్లలో ఈరోజు చుక్కలు వేయించుకోని వారి కోసం ఆరోగ్య కార్యకర్తలు రాబోయే రెండు, మూడు రోజుల పాటు ఇంటింటికీ తిరిగి చుక్కలు వేస్తారని ఆయన వివరించారు. గతంలో పిల్లలకు సాధారణ టీకాలు వేయించినప్పటికీ, భవిష్యత్తులో వచ్చే పోలియో ప్రమాదం నుండి పూర్తి రక్షణ లభించాలంటే ఈ అదనపు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తల్లిదండ్రులందరూ తమ సమీపంలోని ఆరోగ్య కేంద్రం లేదా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు పోలియో చుక్కలు వేయించి, వారి భవిష్యత్తుకు భద్రత చేకూర్చాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు చింతల శ్రీనివాస్, మాచర్ల రాజు, శ్రీపతి స్వర్ణలత నరేష్, మంద రాధా, కొలుగూరి సురేష్, చుంచు రమాదేవి, ప్రభుత్వ వైద్యురాలు చందనతో పాటు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

