ఓటర్ల జాబితా సవరణలో ప్రతి ఓటూ ముఖ్యం: హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్
కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్,జూన్ 29: హుజురాబాద్ మండలం రంగాపూర్ గ్రామంలో సాగుతున్న ఓట్ల జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ సోమవారం పాల్గొన్నారు. సర్వే కో ఆర్డినేటర్లతో కలిసి ఇంటింటికీ జరుగుతున్న ఈ తనిఖీలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో కీలకమైందని, అందువల్ల బూత్ లెవెల్ ఏజెంట్లు (బిఎల్ఏలు) అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి బిఎల్ఏ విధిగా బూత్ లెవెల్ ఆఫీసర్లతో (బిఎల్ఓ) కలిసి ఈ సర్వే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ నిశితంగా గమనిస్తోందని ప్రణవ్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అన్ని బూత్లలోని ఏజెంట్లు యాక్టివ్గా ఉంటూ, బిఎల్ఓలు ఇచ్చే సెట్ ఫారాలను ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా భర్తీ చేయాలని ఆదేశించారు. అర్హులైన కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, గ్రామంలో ఒక్క ఓటు కూడా గల్లంతు కాకుండా, ఏ ఒక్కరూ ఓటు హక్కును కోల్పోకుండా పూర్తి బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో సర్ ప్రక్రియ కో ఆర్డినేటర్లతో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, గ్రామ శాఖ అధ్యక్షుడు, కో ఆర్డినేటర్లు , సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

