సర్వాయిపేటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటు పనుల పరిశీలన: నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని ఆదేశం
హుస్నాబాద్,వి90 న్యూస్,జూన్ 29: సైదాపూర్ మండలంలోని చారిత్రక సర్వాయిపేట గ్రామంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వీరయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటు పనులను సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విగ్రహ ఏర్పాటు పనులతో పాటు గ్రామంలో వివిధ నిధులతో కొనసాగుతున్న పలు ఇతర అభివృద్ధి పనుల పురోగతిని కూడా ఈ సందర్భంగా నిశితంగా తనిఖీ చేశారు. ఆయా పనుల ప్రస్తుత పరిస్థితి, పూర్తి కావడానికి పట్టే సమయం తదితర వివరాలను అక్కడ ఉన్న ఇంజనీరింగ్, స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా చారిత్రక ప్రాధాన్యత కలిగిన సర్వాయిపేట గ్రామాన్ని పర్యాటకంగా, సర్వతోముఖాభివృద్ధి దిశగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గ్రామంలో జరుగుతున్న ప్రతి పనిలోనూ ఉన్నతమైన నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనుల నాణ్యతపై ఎక్కడా రాజీ పడకూడదని అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. నిర్దేశిత గడువులోగా అన్ని అభివృద్ధి పనులను అత్యంత వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, నిర్మాణాల్లో ఎలాంటి జాప్యం జరగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.

