నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: వొడితల ప్రణవ్
కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్,జూన్ 30: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పాలనలో నిరుపేదలైన లబ్ధిదారులకు సంక్షేమం, అభివృద్ధిని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ స్పష్టం చేశారు. మంగళవారం నాడు హుజురాబాద్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనారోగ్యం , ఇతర ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆసుపత్రుల పాలైన 82 మంది నిరుపేద లబ్ధిదారులకు, సుమారు 30 లక్షల రూపాయల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను ఆయన నేరుగా అందజేశారు. ఆపదలో ఉన్న నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ చెక్కుల రూపంలో ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఇప్పటివరకు హుజురాబాద్ నియోజకవర్గంలోనే దాదాపు 10 కోట్ల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాల్లో పూర్తి పారదర్శకతను పాటిస్తున్నామని వొడితల ప్రణవ్ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే త్వరలోనే రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విషయంలో ఎవరైనా దళారులు లేదా అధికారులు లబ్ధిదారుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా సస్పెండ్ చేయడానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల ప్రజాప్రతినిధులు, మండలాల అధ్యక్షులు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు , ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

