ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయండి: కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వొడితల ప్రణవ్
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 30: నియోజకవర్గ పరిధిలో ప్రతి బూత్కు సంబంధించి అర్హులైన ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా ఓటరు నమోదు , సవరణ ప్రక్రియలో చురుగ్గా పాల్గొనేలా చూడాలని కరీంనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం రోజున జమ్మికుంట పట్టణంలోని 4, 5, 19, 27, 28, 30 వార్డులలో బూత్ కో-ఆర్డినేటర్లు, బూత్ లెవెల్ ఏజెంట్లతో (BLA) కలిసి ఓటు సమగ్ర సవరణ (సర్) కార్యక్రమ సరళిని వారు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డులలో పర్యటిస్తున్న సమయంలో స్థానిక ఓటర్లు అడిగిన పలు ప్రశ్నలకు, అనుమానాలకు బూత్ లెవెల్ ఆఫీసర్లతో (BLO) మాట్లాడి అక్కడికక్కడే నివృత్తి చేశారు.

అనంతరం నిర్వహించిన పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రతి పది బూత్లకు ఒకరి చొప్పున జమ్మికుంట పట్టణానికి నలుగురు కో-ఆర్డినేటర్లను నియమించామని, వీరు నిరంతరం బూత్ ఏజెంట్లతో సమన్వయం చేసుకుంటూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని దిశా నిర్దేశం చేశారు. బూత్ లెవెల్ అధికారులు వచ్చినప్పుడు బూత్ ఏజెంట్లు క్రమం తప్పకుండా పాల్గొనడం ఎంతో ముఖ్యమని వారు గుర్తుచేశారు.
ఇదే వేదికగా స్థానిక రాజకీయాలపై వారు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కాంట్రవర్సీలు సృష్టించడానికి తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను విమర్శించే ముందు, గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు తాము ఎందుకు పనులు చేయలేకపోయామో ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. గత పాలకులు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షల కోట్లు దోచుకుని, చివరకు దాన్ని కూళేశ్వరంగా మార్చి తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ పేదవాడి ప్రభుత్వంగా నిలబడి ముందుకు సాగుతోందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గ సర్ కో-ఆర్డినేటర్, జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, సీనియర్ నాయకులు , కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

