నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి: తహసీల్దార్కు సీపీఐ వినతి
కరీంనగర్/ఇల్లందకుంట,వి90 న్యూస్, జూలై 01: ఇల్లందకుంట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన స్థలంలేని నిరుపేద కుటుంబాలకు తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అలాగే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కోరుతూ సీపీఐ నాయకులు ఇల్లందకుంట మండల తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. సీపీఐ మండల కార్యదర్శి మాదారపు రత్నాకర్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ, మండలంలో ఎంతో మంది నిరుపేదలు సొంత ఇళ్ల స్థలాలు లేక అద్దె ఇళ్లలో, తాత్కాలిక నివాసాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతూ జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి అర్హులైన ప్రతి పేద కుటుంబాన్ని గుర్తించి వారికి ప్రభుత్వ భూములను కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇందిరమ్మ గృహ పథకం కింద ఇళ్లను మంజూరు చేసి, నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం తరఫున అందించాలని కోరారు.ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను సాకారం చేసేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపి, ప్రభుత్వ భూమిని సేకరించి లబ్ధిదారులకు పంపిణీ చేయాలన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో పేదలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, అర్హులైన అందరికీ గృహ వసతి కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం సీపీఐ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రవి, సమ్మయ్య తదితరులు పాల్గొని తహసీల్దార్కు వినతిపత్రాన్ని అందజేశారు.

