రైతు, కౌలు రైతు, కూలీ భరోసా నిధులను వెంటనే జమ చేయాలి: తెలంగాణ రైతు సంఘం డిమాండ్
తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చేల్పూరి రాము
కరీంనగర్/ఇల్లంతకుంట,వి90 న్యూస్,జూలై 01: ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రూ.15,000 రైతు భరోసా, కౌలు రైతులకు రూ.15,000 కౌలు భరోసా, అలాగే వ్యవసాయ కూలీలకు రూ.12,000 కూలీ భరోసా నిధులను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చెల్పూరి రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం పెరుగుతున్న సాగు ఖర్చులు, ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల ధరల భారంతో రైతాంగం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత భూమి లేక ఇతరుల భూములను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న కౌలు రైతులు, కేవలం వ్యవసాయ పనులపైనే ఆధారపడి జీవిస్తున్న కూలీల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేస్తూ, అర్హులైన వారందరికీ ఈ భరోసా నిధులను నేరుగా ఖాతాల్లో వేయాలన్నారు.దీనితో పాటు రైతులకు పంటల వారీగా గిట్టుబాటు ధరలు కల్పించాలని, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడంతో పాటు వ్యవసాయ రంగానికి అవసరమైన అన్ని రకాల సబ్సిడీలను పునరుద్ధరించాలని కోరారు. ఒకవేళ ప్రభుత్వం ఈ హామీల అమలులో నిర్లక్ష్యం వహిస్తే, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు, కౌలు రైతులు, కూలీలను ఏకం చేసి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని చెల్పూరి రాము హెచ్చరించారు.

