వైద్యరంగంలో ఉస్మానియా సరికొత్త చరిత్ర
ఒకేసారి ఐదు అవయవాల మార్పిడి విజయవంతం
వైద్య బృందానికి సిఎం రేవంత్ రెడ్డి అభినందనలు
హైదరాబాద్,వి90న్యూస్,జూలై 01: హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యులు అసాధారణ ప్రతిభతో వైద్యరంగంలో సరికొత్త రికార్డు సృష్టించారు. ఏకబిగిన 36 గంటలపాటు శ్రమించిన వైద్య బృందం, ఒకే పేషంట్కు ఒకేసారి ఐదు రకాల అవయవ శస్త్రచికిత్సలను అత్యంత విజయవంతంగా నిర్వహించింది. సిరిసిల్లకు చెందిన ఒక 30 ఏళ్ల యువ ఇంజనీర్కు జీర్ణాశయం, డ్యూడెనమ్, ప్యాంక్రియాస్, చిన్నపేగు, పెద్దపేగు అవయవాలను ఒకేసారి మార్పిడి చేసి దేశంలోనే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.వైద్యుల దినోత్సవం రోజే ఈ అద్భుత విజయాన్ని నమోదు చేయడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యులు, ఇతర సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ వైద్యుల దినోత్సవం నాడే ఈ ఘనత సాధించడం వైద్య వృత్తికే మరింత ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు.

