జమ్మికుంట మండలంలో ఇసుక కుప్పల బహిరంగ వేలం
శంభునిపల్లి వద్ద 100 ట్రాక్టర్ల అక్రమ ఇసుక స్వాధీనం, జూలై 4న బహిరంగ వేలం
రూ. 50 వేల ధరఖాస్తు రుసుముతో వేలంలో పాల్గొనేందుకు అవకాశం… తహశీల్దార్ ఉత్తర్వులు
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 03: తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జమ్మికుంట మండల పరిధిలోని శంభునిపల్లి గ్రామం సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక కుప్పలకు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. జమ్మికుంట పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ నివేదిక ఆధారంగా జమ్మికుంట తహశీల్దార్ కార్యాలయం ఈ వేలం ప్రకటనను విడుదల చేసింది. శంభునిపల్లి గ్రామ పరిసరాల్లోని మామిడి తోట వద్ద 20 ట్రాక్టర్ల ఇసుక, ఐబ్రీడ్ ఫారం వద్ద 50 ట్రాక్టర్లు, మరికొన్ని చోట్ల కలిపి మొత్తం 100 ట్రాక్టర్ల పరిమాణంలో అక్రమ ఇసుకను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.ఈ స్వాధీనం చేసుకున్న ఇసుక కుప్పలను జూలై 4వ తేదీ మధ్యాహ్నం 2:00 గంటలకు జమ్మికుంట తహశీల్దార్ కార్యాలయంలో బహిరంగ వేలం వేయనున్నారు. వేలంలో పాల్గొనదలచిన ఆసక్తి గల అభ్యర్థులు జూలై 4వ తేదీ మధ్యాహ్నం 1:00 గంటలోపు నిర్ణీత ధరఖాస్తు రుసుము యాభై వేల రూపాయలను తహశీల్దార్ కార్యాలయంలో నగదు రూపంలో చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ట్రాక్టర్ ఇసుక విలువను 1800 రూపాయలుగా నిర్ణయించగా, మొత్తం 100 ట్రాక్టర్ల ఇసుక నిల్వ విలువ ఒక లక్షా ఎనభై వేల రూపాయలుగా అధికారులు నిర్ధారించారు. ఇసుక నిల్వలను ముందుగా పరిశీలించాలనుకునే వారు శంభునిపల్లి గ్రామ రెవెన్యూ అధికారి (VRO) కె. హరీష్ను సంప్రదించవచ్చు.ఈ వేలానికి సంబంధించి అధికారులు కొన్ని ముఖ్యమైన నిబంధనలను విధించారు. మొత్తం ఇసుక అంతటినీ ఒకే లాట్గా వేలం వేయడం జరుగుతుంది. నిర్ణీత సమయంలోగా ధరఖాస్తు రుసుము చెల్లించిన వారికి మాత్రమే వేలంలో పాల్గొనే అనుమతి ఉంటుంది. వేలంలో అత్యధిక పాడుకున్న వ్యక్తి (హైయెస్ట్ బిడ్డర్) వేలం ముగిసిన వెంటనే పూర్తి మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది, ఒకవేళ చెల్లించని పక్షంలో వారు కట్టిన ధరఖాస్తు రుసుమును తిరిగి ఇవ్వడం జరగదు. వేలంలో పాల్గొని ఇసుక దక్కించుకోని మిగిలిన అభ్యర్థులకు వారి ధరఖాస్తు రుసుమును వేలం ముగిసిన వెంటనే తిరిగి ఇచ్చివేస్తారు. అయితే ఈ వేలాన్ని ఎటువంటి కారణం చేతనైనా వాయిదా వేసేందుకు లేదా రద్దు చేసేందుకు పూర్తిగా జమ్మికుంట తహశీల్దార్కే సర్వాధికారాలు ఉంటాయని ప్రకటనలో స్పష్టం చేశారు.

