జమ్మికుంటలో ప్లాస్టిక్ నిషేధంపై మున్సిపల్ అధికారుల ఉక్కుపాదం: నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 14: జమ్మికుంట పట్టణాన్ని సింగిల్-యూజ్ ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ యంత్రాంగం తన చర్యలను ముమ్మరం చేసింది. మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి ఆదేశాల మేరకు మంగళవారం పట్టణంలోని వారసంతతో పాటు ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణదారులకు, వ్యాపారులకు ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు.

తనిఖీల్లో భాగంగా సానిటరీ ఇన్స్పెక్టర్ ఇల్లందుల రమేష్ మాట్లాడుతూ, పర్యావరణానికి తీవ్ర హాని కలిగించే ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, ఇతర నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపయోగించవద్దని వ్యాపారులను కోరారు. ప్లాస్టిక్కు బదులుగా పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ మార్పు కోసం వ్యాపారులకు వారం రోజుల పాటు గడువు ఇస్తున్నామని, ఆ తర్వాత కూడా ఎవరైనా ప్లాస్టిక్ వినియోగాన్ని కొనసాగిస్తే వారి దుకాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్తో పాటు జవాన్ కిరణ్ , మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

