“ఎర్ర బస్సు రాని చోటకు ఎయిర్ బస్సా?” అన్నవారికి భోగాపురం ఎయిర్పోర్టే సమాధానం..
రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమికి తపనపడ్డా: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు!
భోగాపురం,వి90 న్యూస్,ఆగస్టు 01: భోగాపురంలో నిర్మించిన ప్రతిష్టాత్మక అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేదికగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిపక్షాల విమర్శలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర, రాష్ట్ర మంత్రుల సమక్షంలో ఈ ఎయిర్పోర్ట్ అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్.. గతంలో “ఎర్ర బస్సు రాని చోటకు ఎయిర్ పోర్ట్ కడతారా” అంటూ అభివృద్ధిని అపహాస్యం చేసి ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసిన నాయకులకు ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తి కావడమే గట్టి సమాధానమని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం కావడం కోసమే తాము 2024 ఎన్నికల్లో మూడు పార్టీల కూటమి కోసం తీవ్రంగా తపనపడ్డామని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. ఈ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా రూ. 17,435 కోట్ల విలువైన రోడ్డు, ఇంధన, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు ప్రారంభం కావడం ఆంధ్రప్రదేశ్ ప్రగతి ప్రయాణంలో నూతన అధ్యాయానికి నాంది అని అభివర్ణించారు. అమరావతి, విశాఖపట్నం, రాయలసీమ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులతో పాటు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ సాకారం కావడం రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తుందన్నారు.

ఇదే క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పై కొందరు పలకరిస్తున్న విమర్శలపై డిప్యూటీ సీఎం తీవ్రంగా స్పందించారు. అధికారంలోకి వచ్చాక ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా, దేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నత ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడానికి నిస్వార్థంగా శ్రమిస్తున్న ప్రధాని మోదీని ఇష్టానుసారం తూలనాడుతుంటే తన గుండె కదిలిపోయిందని, కన్నీళ్లు వచ్చాయని భావోద్వేగానికి గురయ్యారు.

సరిహద్దుల వద్ద శత్రువులతో, అంతర్గత సవాళ్లతో పోరాడుతూ 144 కోట్ల మంది భారతీయులను ముందుకు నడిపించడం ఒక మహాకార్యమని, ప్రస్తుత భారతదేశంలో మోదీ గారికి సాటివచ్చే నాయకుడు మరొకరు లేరని తేల్చిచెప్పారు. దేశ ప్రగతి కోసం రామకార్యం లాంటి సేవ చేస్తున్న ప్రధాని మోదీ కి యావత్ రాష్ట్రం, దేశం భరోసాగా వెన్నుదన్నుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

