తెలంగాణలో ఇంధన సెగ: పెట్రోల్ బంకుల వద్ద క్యూలైన్లు.. పుకార్లను నమ్మవద్దని సర్కార్ విజ్ఞప్తి!
హైదరాబాద్, ఏప్రిల్ 28 (V90 NEWS) : గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడనుందనే వార్తలు సామాన్య ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న వివిధ ప్రచారాల నేపథ్యంలో, రాష్ట్రంలోని ప్రధాన నగరాల నుంచి పల్లెల వరకు పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల రద్దీ అసాధారణంగా పెరిగింది. పానిక్ బయింగ్ కారణంగా అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ కావడమే కాకుండా, బంకుల్లో ఉన్న నిల్వలు గంటల వ్యవధిలోనే ఖాళీ అవుతున్నాయి.
పుకార్ల ప్రభావం – క్షేత్రస్థాయిలో పరిస్థితి:
ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి నగరాల్లో వాహనదారులు తమ వాహనాల ట్యాంకులను ఫుల్ చేయించుకోవడానికే కాకుండా, డబ్బాల్లో కూడా ఇంధనాన్ని నింపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చమురు సంస్థలు సరఫరాను నిలిపివేశాయని, రానున్న రోజుల్లో ధరలు భారీగా పెరగనున్నాయనే తప్పుడు వార్తలు ఈ గందరగోళానికి ప్రధాన కారణమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ల రాక ఆలస్యం కావడంతో “నో స్టాక్” బోర్డులు దర్శనమివ్వడం ప్రజల్లో అనుమానాలను మరింత బలపరిచింది.
ప్రభుత్వం , అధికారుల స్పందన:
ఈ పరిస్థితులపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఇంధన కొరత అనేది కేవలం ఒక అపోహ మాత్రమేనని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 24,000 కిలోలీటర్ల పెట్రోల్ మరియు డీజిల్ నిల్వలు సిద్ధంగా ఉన్నాయి. చమురు కంపెనీలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం ప్రతిరోజూ తమ డిపోల నుండి నిరంతరాయంగా లోడింగ్ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. ఇంధన సరఫరాలో ఎక్కడా కోత విధించలేదని, రవాణా వ్యవస్థ కూడా సజావుగా సాగుతోందని అధికారులు వివరించారు.
అప్రమత్తంగా ఉండాలి:
ప్రజలు ఇలాంటి పుకార్లను నమ్మి అనవసరంగా భయాందోళన చెందవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ఒకేసారి అందరూ బంకులకు రావడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని, కేవలం అవసరమైన మేరకే ఇంధనాన్ని తీసుకోవాలని సూచించింది. ఎవరైనా బంకుల యజమానులు కావాలని స్టాక్ ని దాచిపెట్టినా లేదా అధిక ధరలకు విక్రయించినా పౌరసరఫరాల శాఖకు ఫిర్యాదు చేయాలని కోరింది. సరిహద్దు ప్రాంతాల్లో కూడా నిఘా పెంచామని, ఇంధన రవాణా ట్యాంకర్లకు ఎక్కడా అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
