మున్సిపల్ అధికారిపై దాడికి నిరసనగా జమ్మికుంటలో నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల ప్రదర్శన
కరీంనగర్, ఏప్రిల్ 28 (V90 NEWS) : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శానిటరీ ఇన్స్పెక్టర్పై జరిగిన దాడిని నిరసిస్తూ జమ్మికుంట మున్సిపల్ ఉద్యోగులు మంగళవారం నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ ఆదేశాల మేరకు మేనేజర్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులందరూ పాల్గొని బాధితుడికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మేనేజర్ రాజిరెడ్డి మాట్లాడుతూ, కరీంనగర్ కార్పొరేషన్లో ఒక కార్పొరేటర్ భర్త విధి నిర్వహణలో ఉన్న అధికారిపై భౌతిక దాడికి దిగడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధుల్లో ఉన్న ఉద్యోగులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇలాంటి దాడులు ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయని ఆయన పేర్కొన్నారు. తక్షణమే సదరు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మున్సిపల్ సిబ్బందికి తగిన భద్రత కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ వాణి, భాస్కర్, శ్రీనివాస్తో పాటు వార్డు అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
