ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్.. ఫీజు చెల్లింపుల్లో 25 శాతం భారీ రాయితీ!
కరీంనగర్ ,జమ్మికుంట ఏప్రిల్ 30: తెలంగాణ రాష్ట్రంలోని ప్లాట్ల యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ ఫీజుల చెల్లింపుపై ఏకంగా 25 శాతం భారీ రాయితీని ప్రకటిస్తూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ వివరాలను వెల్లడించారు. ఎల్ఆర్ఎస్-2020 కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్లాట్ యజమానులందరికీ ఈ వెసులుబాటు వర్తించనుంది.ప్రభుత్వం ప్రకటించిన ఈ భారీ రాయితీ 2026 మే 1వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు, అంటే మూడు నెలల పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించే వారికి మాత్రమే ఈ 25 శాతం తగ్గింపు లభిస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వేగంగా క్లియర్ చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఈ అరుదైన అవకాశాన్ని ప్లాట్ల యజమానులు సద్వినియోగం చేసుకుని, తమ ఆస్తులను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించుకోవాలని అధికారులు కోరుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల వేలాది మందికి ఆర్థికంగా భారీ ప్రయోజనం చేకూరనుంది.
