కీసరలో ఘనంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
పేద కుటుంబాలకు అండగా ప్రభుత్వ పథకాలు: కాంగ్రెస్ ఇంచార్జి వజ్రేష్ యాదవ్
మేడ్చల్ మల్కాజ్గిరి మే 02 ;మల్కాజిగిరి కార్పొరేషన్ కీసర సర్కిల్ పరిధిలోని కీసర డివిజన్లో ఉన్న కేబీఆర్ కన్వెన్షన్లో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం’లో భాగంగా శనివారం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు స్వయంగా లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం తోటకూర వజ్రేష్ యాదవ్ ప్రసంగిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని తెలిపారు. ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయం ద్వారా నిరుపేద కుటుంబాలపై పెళ్లి ఖర్చుల భారం గణనీయంగా తగ్గుతోందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ప్రభుత్వ అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
