సిర్సపల్లి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ తరలింపుపై మంత్రి శ్రీధర్ బాబు హామీ
– మంత్రికి వినతిపత్రం అందజేసిన నాయకులు.
– సానుకూలంగా స్పందించిన మంత్రి,ముఖ్యమంత్రితో చర్చించి తరలింపునకు సహకరిస్తానని హామీ ఇచ్చిన మంత్రి.
హైదరాబాద్ ,మే 2: హుజురాబాద్ పట్టణ పరిధిలోని సిర్సపల్లి శివారులో ఏర్పాటు చేయతలపెట్టిన వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను ఇతర ప్రాంతానికి తరలించాలని కోరుతూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు వినతిపత్రం సమర్పించారు. శనివారం సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష జేఏసీ నాయకులు, హుజురాబాద్ ప్రాంత ముఖ్య నేతలు మంత్రితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ప్లాంట్ ఏర్పాటు వల్ల స్థానికంగా ఎదురయ్యే ఇబ్బందులను, ప్రజల ఆందోళనలను నాయకులు మంత్రికి వివరించారు. ప్లాంట్ తరలింపు విషయంలో ప్రభుత్వం చొరవ చూపి, వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని వారు కోరారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందిస్తూ, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్లాంట్ తరలింపునకు అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె సుహాసిని, వివిధ వార్డుల కౌన్సిలర్లు, హుజురాబాద్ సర్పంచుల ఫోరం అధ్యక్షులు పత్తి అనిత-కృష్ణారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, జేఏసీ నాయకులు, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు మరియు పార్టీ ముఖ్య నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
