అక్షరాల సాక్షిగా ‘అమ్మ’ఒడికి పూర్వ విద్యార్థి కానుక.. జమ్మికుంట జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు నగదు పురస్కారాలు!
జమ్మికుంట మే 04: చదువుకున్న పాఠశాల మీద మమకారంతో జమ్మికుంట పవన్ మొబైల్ షాప్ యాజమాన్యం, పూర్వ విద్యార్థి శ్రీనివాస్ దంపతులు గొప్ప మనసు చాటుకున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు)లో 2026 ఎస్ఎస్సీ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నగదు పురస్కారాలతో గౌరవించారు. ప్రథమ స్థానం సాధించిన చి. విష్ణువర్ధన్, ద్వితీయ స్థాన విజేత బి. దీప్తేశ్లకు రూ. 3500 చొప్పున, తృతీయ స్థానంలో నిలిచిన చి. అభినవ్కు రూ. 3000 నగదును అందజేసి వారిని ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బాదం సురేష్ బాబు మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు ఇలా ముందుకు వచ్చి ప్రస్తుత విద్యార్థులకు తోడ్పాటు అందించడం ఎంతో గర్వకారణమని, విద్యపై శ్రద్ధ ఉంటేనే ఉన్నత భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. సీనియర్ ఉపాధ్యాయులు సంతోష్ కుమార్ విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించగా, తెలుగు ఉపాధ్యాయులు సమ్మయ్య దాతలైన శ్రీనివాస్ దంపతుల సేవలను కొనియాడారు. విద్యార్థుల ప్రతిభను, దాతల ఉదారతను పాఠశాల సిబ్బంది మరియు స్థానికులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
