హుజురాబాద్లో ఉద్రిక్తత: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ముట్టడికి బీజేపీ యత్నం
హుజురాబాద్,V90 NEWS, మే 07: కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్పై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు నియోజకవర్గంలో తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఉదయం బీజేపీ నాయకులు హుజురాబాద్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో పట్టణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కరీంనగర్లో మీడియా సమావేశం నిర్వహించిన కౌశిక్ రెడ్డి, కేంద్ర మంత్రిపై విమర్శలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన బీజేపీ శ్రేణులు, ఆయనను హుజురాబాద్ నుండి తరిమికొట్టాలని నినాదాలు చేస్తూ భారీ ప్రదర్శనగా క్యాంప్ ఆఫీస్ వైపు దూసుకెళ్లారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ముట్టడికి యత్నించిన బీజేపీ నాయకులను మార్గమధ్యలోనే అడ్డుకున్నారు. పోలీసులకు మరియు నిరసనకారులకు మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి కాసేపు అదుపు తప్పింది. చివరకు పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని హుజురాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ నిరసన కార్యక్రమంలో జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు 27వ వార్డు కౌన్సిలర్ శీలం శ్రీనివాస్, దళిత మోర్చా నాయకులు రాజేష్ ఠాకూర్, పట్టణ కార్యదర్శి రాకేష్ ఠాకూర్, పట్టణ ఉపాధ్యక్షులు అడువాలా శ్రీధర్, ఆవుల తిరుపతి, హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజుతో పాటు పలువురు బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
