మణుగూరులో మందుబాబు వీరంగం: డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులపై కత్తితో దాడికి యత్నం!
భద్రాద్రి కొత్తగూడెం,V90 NEWS, మే 08: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో తీవ్ర కలకలం రేగింది. తోగ్గుడెం ప్రాంతంలో పోలీసులు యథావిధిగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా, మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి అమానుషంగా ప్రవర్తించాడు. వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగిన సదరు వ్యక్తి, ఒక్కసారిగా తన వద్ద ఉన్న కత్తిని తీసి పోలీసులపైకి దూసుకెళ్లాడు. నడిరోడ్డుపై కత్తి పట్టుకొని పోలీసులను బెదిరిస్తూ వీరంగం సృష్టించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులను లక్ష్యంగా చేసుకుని అతను చేసిన ఈ దాడి యత్నం అక్కడున్న వారిని షాక్కు గురిచేసింది. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి, ప్రాణాలకు తెగించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న ఆ నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
