మోడీ బహిరంగ సభను విజయవంతం చేయండి: ఎర్రబెల్లి సంపత్ రావు పిలుపు
కరీంనగర్ ,వి90న్యూస్,మే 09: హైదరాబాద్ వేదికగా రేపు సాయంత్రం జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని, దేశాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ బలపరచాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు. మోడీ రాకతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంటుందని, ఈ సభ తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.గతంలో పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సంపత్ రావు విమర్శించారు. ఈ రెండు పార్టీల వైఖరి పట్ల తెలంగాణ ప్రజలు విసుగు చెందారని, అందుకే ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. మోడీ పరిపాలనపై ప్రజల్లో ఉన్న నమ్మకం రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీని బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు, మోడీ అభిమానులు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ బహిరంగ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని ఆయన కోరారు.
