హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి మహర్దశ: త్వరలో అందుబాటులోకి అత్యాధునిక ట్రామా కేర్ సెంటర్
హుజురాబాద్ ,వి90 న్యూస్,మే 11: హుజూరాబాద్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా మరో ముందడుగు పడింది. స్థానిక ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో త్వరలోనే అత్యాధునిక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు కాబోతోంది. హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్ చేసిన విజ్ఞప్తికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సానుకూలంగా స్పందించడంతో ఈ దిశగా అడుగులు పడ్డాయి.వరంగల్, కరీంనగర్ వంటి ప్రధాన నగరాల మధ్య హుజూరాబాద్ కీలక కేంద్రంగా ఉంది. ఈ రహదారిపై తరచూ జరిగే ప్రమాదాల దృష్ట్యా, క్షతగాత్రులకు అత్యవసర చికిత్స అందించేందుకు ట్రామా కేర్ సెంటర్ అవసరాన్ని ప్రణవ్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి సానుకూల నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని, పేదలకు నాణ్యమైన వైద్యం చేరువ చేయడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ పేర్కొన్నారు. ఈ సెంటర్ అందుబాటులోకి వస్తే ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
