కాకతీయుల వారసత్వాన్ని కూల్చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజం
ఖానాపురం/నర్సంపేట, వి90 న్యూస్ మే 11: నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో కాకతీయుల కాలం నాటి చారిత్రక మట్టికోట , శివాలయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ధ్వంసం చేయడంపై మాజీ మంత్రులు తన్నీరు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం వారు ధ్వంసమైన ఆలయ ప్రాంతాన్ని సందర్శించి, ప్రభుత్వం చేపట్టిన తవ్వకాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేవాలయాలను, పాఠశాలలను నిర్మించి ఆధ్యాత్మికతను, విద్యను ప్రోత్సహిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేదల ఇళ్లను కూల్చడమే కాకుండా, కడకు దైవ చింతన లేకుండా 800 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయాన్ని కూడా ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో ఆలయాలను పునరుద్ధరించామని, రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడానికి ఢిల్లీ స్థాయిలో పోరాడామని ఆయన గుర్తు చేశారు.కాకతీయుల కంచుకోట లాంటి వరంగల్ గడ్డపై వారి వారసత్వ సంపదను ధ్వంసం చేయడం అక్షమ్యమని, ఇది ఈ ప్రభుత్వం చేసిన అతిపెద్ద పాపమని దయాకర్ రావు విమర్శించారు. ఎన్నికల ముందు దేవుళ్లపై ఒట్టు వేసి, ఇప్పుడు అదే దేవుళ్ల గుడులను కూల్చడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఈ తవ్వకాలు చూస్తుంటే పురాతన సంపద లేదా లంకబిందెల కోసమే ప్రభుత్వం ఈ విధ్వంసానికి పాల్పడినట్లు కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన తప్పు తెలుసుకొని, వెంటనే ధ్వంసమైన ఆలయ పునరుద్ధరణ పనులను చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు , పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
