గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే బోడే ప్రసాద్
పెనమలూరు, వి90 న్యూస్, మే 11: గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ స్పష్టం చేశారు. పెనమలూరు మండలం వణుకూరు గ్రామంలోని ఆర్బీకే సమీపంలో గల 4,5వ లే అవుట్లలో సుమారు రూ.50 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్లను ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక ప్రజలు, నాయకులు ఘనస్వాగతం పలికారు.అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాల పంపిణీ శాస్త్రీయంగా జరగలేదని, కనీస వసతులు లేని మారుమూల ప్రాంతాల్లో స్థలాలు కేటాయించడం వల్ల పేదలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు నిర్మించుకున్న చోట రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు కల్పించడంలో గత పాలకులు పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు.ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఇందులో భాగంగానే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, కాలనీల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేశామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా జీవించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, పేద, మధ్యతరగతి వర్గాల సొంతింటి కల సాకారం చేసేందుకు త్వరలోనే కొత్త గృహ రుణ పథకాలను తీసుకురానున్నట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అనుములు ప్రభాకర్, కోయ ఆనంద ప్రసాద్, కొమ్మినేని శ్రీనివాస్, సుంకర రమేష్, కాసర్నేని మురళి, మాబు సుభాని, అబ్దుల్ సలాం, పీత గోపీచంద్, సంఘపు రంగారావు, వల్లి నరసింహారావు, ఎందువ రాంబాబు, కాసర్నేని రాము, బొమ్మసాని శ్రీనివాసరావు, డీఈ శ్రీనివాస్ , ఇతర అధికారులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
