జమ్మికుంట రైల్వే స్టేషన్లో గుర్తుతెలియని మహిళ మృతి: ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసుల విన్నపం
జమ్మికుంట,వి90 న్యూస్, మే 11: జమ్మికుంట రైల్వే స్టేషన్లో అనారోగ్యంతో స్పృహ తప్పి పడిపోయిన ఓ గుర్తుతెలియని మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రభుత్వ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 25 నుంచి 30 ఏళ్ల వయస్సు కలిగిన సదరు మహిళ ఈ నెల 9వ తేదీన జమ్మికుంట రైల్వే స్టేషన్ టికెట్ బుకింగ్ హాల్ వద్ద అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన చీఫ్ బుకింగ్ సూపర్వైజర్ వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. తొలుత ఆమెను జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం (తేది 10-05-2026) రోజున ఆమె మరణించింది.మృతురాలు బ్లూ కలర్ డిజైన్ కలిగిన హాఫ్ ప్యాంట్, పింక్-బ్లూ-పసుపు రంగుల డిజైన్ గల టాప్ ధరించి ఉంది. ఆమె వద్ద ఎటువంటి గుర్తింపు కార్డులు లభించకపోవడంతో ఆచూకీ లభ్యం కాలేదు. కాగా, మృతురాలితో పాటు ఉన్న సుమారు 4 సంవత్సరాల వయస్సు గల బాలుడిని అధికారులు చైల్డ్ హోమ్కు తరలించారు. ప్రస్తుతం మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీలో భద్రపరిచినట్లు హెడ్ కానిస్టేబుల్ జి. తిరుపతి తెలిపారు. ఈ ఘటనపై రామగుండం రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి సంబంధించిన వివరాలు ఎవరికైనా తెలిసినట్లయితే 9949304574, 8712658604 నంబర్లకు సంప్రదించి సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
