జర్నలిస్టుల ఇళ్ల స్థలాల చిక్కుముడి వీడే వేళ: జూన్ 2న శుభవార్త చెబుతామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ ,వి90న్యూస్ మే 12 : తెలంగాణ జర్నలిస్టుల చిరకాల స్వప్నమైన ఇళ్ల స్థలాల వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. జూన్ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులకు తీపి కబురు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు ఈనెల 21న నిర్వహించనున్న రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఇళ్ల స్థలాల అంశంపై లోతుగా చర్చించి, చట్టబద్ధత కల్పించే విధంగా నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేస్తూ, దీనిపై ప్రత్యేకంగా క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు సీఎం పేర్కొన్నారు. ఈ కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉంటారు. క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా జూన్ 2 లోపు తుది నిర్ణయం తీసుకుని, అర్హులైన జర్నలిస్టులకు లబ్ధి చేకూరుస్తామని ముఖ్యమంత్రి వివరించారు.
