సింహపురి గడ్డపై మహానాడు నిర్వహించడం మా అదృష్టం: ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
నెల్లూరు,వి90 న్యూస్, మే 13: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు వేడుకలకు నెల్లూరు జిల్లా వేదిక కావడంపై సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కొడవలూరు మండలం రేగడిచెలిక కిసాన్ సెజ్ లోని మహానాడు ప్రాంగణంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి, నారా లోకేష్ బాబు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడును సింహపురి గడ్డపై నిర్వహించడం తమకెంతో గర్వకారణమని పేర్కొన్నారు.గతంలో హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్స్ నుండి పరేడ్ మైదానం వరకు కార్యకర్తలతో కలిసి నడిచిన రోజులను, తీగల కృష్ణారెడ్డి గుర్రపు స్వారీ వంటి జ్ఞాపకాలను ఆయన నెమరువేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధి, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, భవిష్యత్ ప్రణాళికలను ప్రజలకు వివరించేందుకు ఈ మహానాడు ఒక దిక్సూచిలా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ భారీ బహిరంగ సభను కనివినీ ఎరుగని రీతిలో విజయవంతం చేసేందుకు కమిటీ సభ్యులందరూ సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు , మహానాడు కమిటీల కన్వీనర్లు పాల్గొని ఏర్పాట్లపై సుదీర్ఘంగా సమీక్షించారు.
