బండి సంజయ్ కుమారుడి వ్యవహారంపై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు: రాజకీయాల కంటే బాధితురాలి గౌరవమే ముఖ్యం
హైదరాబాద్ ,వి90న్యూస్, మే 13 : బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన తాజా వివాదంపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఈ మొత్తం వ్యవహారంలో బాధితురాలి ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, ఆమె ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు. ఇలాంటి సున్నితమైన అంశాలను రాజకీయ లబ్ధి కోసం అతిగా ఫోకస్ చేయడం వల్ల సమాజంలో ఆడపిల్లలకు మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ప్రచారం కోసం బాధితురాలి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించవద్దని, అనవసర రాద్ధాంతాలకు తెరలేపడం సరికాదని ఆమె హితవు పలికారు.అదే సమయంలో బాధితురాలికి న్యాయం జరగడంలో ఎలాంటి జాప్యం ఉండకూడదని కవిత డిమాండ్ చేశారు. చట్టం తన పని తాను చేయాలని పేర్కొంటూ, ఈ ఘటనలో బండి సంజయ్ కుమారుడితో పాటు ప్రమేయం ఉన్న వారందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలని కోరారు. మహిళల రక్షణ గురించి ప్రసంగాలు చేసే వారు క్షేత్రస్థాయిలో ఇలాంటి ఘటనలపై చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఆమె సూచించారు. ఈ వ్యవహారాన్ని రాజకీయ కోణంలో వాడుకుంటున్నారన్న విమర్శలపై పరోక్షంగా స్పందిస్తూ, పార్టీల కంటే మహిళల భద్రతే తమకు ముఖ్యమని తన గళాన్ని వినిపించారు.
