నీట్ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: పీడీఎస్యూ డిమాండ్
కరీంనగర్, వి90న్యూస్ ,మే 14: దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ (NEET) పరీక్షలో ప్రశ్నాపత్రం లీకేజీ అయిందనే ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని పీడీఎస్యూ (PDSU) జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లక్షలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో కష్టపడి రాసిన పరీక్షలో అక్రమాలు చోటుచేసుకోవడం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యాయని గుర్తు చేస్తూ, ఇందుకు నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన కోరారు.నీట్ ప్రవేశ పరీక్షల నిర్వహణలో రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అంగిడి కుమార్ అభిప్రాయపడ్డారు. కొందరి స్వార్థపూరిత అక్రమ చర్యల వల్ల విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని, ఇది విద్యార్థులు , తల్లిదండ్రులలో తీవ్ర ఆవేదనతో పాటు ఆగ్రహాన్ని కలిగిస్తోందని విమర్శించారు. ఇలాంటి ఘటనలు విద్యా వ్యవస్థ పారదర్శకతను దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ వ్యవహారంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు దినేష్, మురళి, రాజ్ కుమార్, భరత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
