పింఛను లబ్ధిదారులకు అలెర్ట్: నెల రోజుల్లోగా లైవ్ ఆథెంటికేషన్ పూర్తి చేసుకోవాలి – జమ్మికుంట మున్సిపల్ కమిషనర్
జమ్మికుంట,వి90 న్యూస్,మే 15: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని పింఛను లబ్ధిదారులకు మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి కీలక సూచన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెన్షన్ లైవ్ ఆథెంటికేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 15వ తేదీ నుండి వచ్చే నెల 15వ తేదీ వరకు నెల రోజుల పాటు ఈ నమోదు ప్రక్రియ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.వృద్ధాప్య, వికలాంగ, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు మరియు ఒంటరి మహిళా పింఛన్లతో పాటు ఇతర అన్ని రకాల పింఛన్ల లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ ఆథెంటికేషన్ను పూర్తి చేసుకోవాలని కమిషనర్ సూచించారు. లబ్ధిదారులు తమ ఆధార్ కార్డుతో సంబంధిత వార్డు అధికారులను సంప్రదించాలని, వార్డు అధికారులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా ఫేస్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) పద్ధతిలో లైవ్ ఆథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారని వివరించారు.ప్రతి వార్డులో నిర్ణీత ప్రాంతాల్లో అందుబాటులో ఉండే వార్డు అధికారుల వద్దకు వెళ్లి ఈ సర్వేను చేయించుకోవాలని ఆయన కోరారు. భవిష్యత్తులో పింఛన్ల పంపిణీలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా, నిరంతరాయంగా పింఛన్ సొమ్ము అందేలా చూసేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని మల్లికార్జున స్వామి స్పష్టం చేశారు. పింఛను దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిర్ణీత గడువులోగా నమోదు ప్రక్రియను ముగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
