ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి – ఎస్ఎఫ్ఐ డిమాండ్
జమ్మికుంట,వి90 న్యూస్, మే 16: రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో కొనసాగుతున్న ఫీజుల దోపిడీని తక్షణమే అరికట్టాలని, ఇందుకోసం ప్రత్యేక ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) డిమాండ్ చేసింది. శనివారం జమ్మికుంట మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మండల విద్యాధికారి (ఎంఈఓ) హేమలతకు ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఫీజుల నియంత్రణకు సరైన చట్టాలు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను నిలువునా దోచుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రైవేట్ విద్యా దోపిడీని అరికడతామని నాడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, కానీ నేడు అందుకు భిన్నంగా ప్రభుత్వ ప్రజాప్రతినిధులే స్వయంగా కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రారంభిస్తుండడం విచారకరమన్నారు. హోర్డింగులు, సోషల్ మీడియా ప్రకటనలతో తల్లిదండ్రులను ఆకర్షిస్తూ, ఎలాంటి అనుమతులు లేకుండా అపార్ట్మెంట్లలో సైతం నూతన పాఠశాలలను నడుపుతున్నారని మండిపడ్డారు.మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సర్కారు విద్యావ్యవస్థను బలోపేతం చేయడంలో విద్యాశాఖ అధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణ కొరవడిందని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫీజుల నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు ఎండి సిద్ధిక్, విద్యార్థి నాయకులు శివకుమార్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.
