జమ్మికుంట మండలంలో పోలీసుల ముమ్మర తనిఖీలు: రికార్డులు లేని వాహనాలు స్వాధీనం
జమ్మికుంట, వి90 న్యూస్, మే 20: జమ్మికుంట మండల పరిధిలోని పలు గ్రామాల్లో పోలీసులు మంగళవారం భారీ కార్డన్ సెర్చ్ (CASO) నిర్వహించారు. జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో హుజూరాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్, సైదాపూర్ ఎస్ఐతో పాటు ఎస్ఐలు యూన్స్, రవి తమ సిబ్బందితో కలిసి విలాసాగర్, తనుగుల, గండ్రపల్లి గ్రామాల్లో ఈ ఆపరేషన్ చేపట్టారు. గ్రామాల సరిహద్దులను దిగ్బంధించి, ప్రతి ఇల్లాన్ని, వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.ఈ అకస్మిక తనిఖీల్లో సరైన పత్రాలు, ఆధారాలు లేని ఎనిమిది మోటార్ సైకిళ్లతో పాటు రెండు ఖాళీ ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి, రికార్డులు లేకుండా తిరుగుతున్న సదరు వాహనదారులపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. గ్రామాల పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, వాహనదారులు తప్పనిసరిగా సరైన పత్రాలను కలిగి ఉండాలని ఈ సందర్భంగా పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.
