జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో అవినీతి కలకలం: కమిషనర్కు కాంగ్రెస్, టీజేఎస్ నాయకుల ఫిర్యాదు

జమ్మికుంట,వి90 న్యూస్,మే 21 : జమ్మికుంట మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అవినీతి అక్రమాలపై నూతన మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్కు లిఖితపూర్వక ఫిర్యాదు అందింది. గురువారం కాంగ్రెస్ పార్టీ ఓబీసీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి యగ్గని శ్రీనివాస్, తెలంగాణ జన సమితి (TJS) యువజన విభాగం జిల్లా అధ్యక్షులు అరికిల్ల భానుచందర్ లు కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న బోల్ల సదానందంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.గత కొద్దిరోజులుగా చెత్త సేకరణ వాహనాల డ్రైవర్లు సదానందంపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, గతంలో జరిగిన ఏసీబీ అధికారుల విచారణలో సైతం లక్షల రూపాయల అవినీతికి సంబంధించి ఇతని పేరే ప్రముఖంగా వినిపించిందని నాయకులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ గత మున్సిపల్ అధికారులు ఇతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా విధుల్లో కొనసాగించడంపై స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు వివరించారు.ఇటీవల ఓ మున్సిపల్ కౌన్సిలర్ పేరుతో, ఒక మున్సిపల్ డ్రైవర్తో మాట్లాడినట్లు చెబుతున్న ఆడియో రికార్డింగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోందని వారు గుర్తుచేశారు. ఒక కౌన్సిలర్ బహిరంగంగానే సదానందంపై ఆరోపణలు చేస్తున్నా అధికారులు స్పందించకపోవడం వల్ల మున్సిపల్ శాఖపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై మున్సిపల్ కమిషనర్ స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే, ఈ అవినీతి అంశాన్ని మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ (RDMA), జిల్లా కలెక్టర్, అలాగే మున్సిపల్ శాఖ రాష్ట్ర కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని నాయకులు యగ్గని శ్రీనివాస్, అరికిల్ల భానుచందర్ స్పష్టం చేశారు.
