ఇల్లంతకుంటలో వృద్ధుడి విషాదాంతం: బావిలో దూకి ఆత్మహత్య
ఇల్లందకుంట,వి90 న్యూస్, మే 21: ఇల్లందకుంట గ్రామానికి చెందిన కందాల మల్లేష్ (70) అనే వృద్ధుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈనెల 15వ తేదీ నుండి మల్లేష్ కనిపించకుండా పోవడంతో, అతని భార్య కందాల పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో ఇప్పటికే మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ క్రమంలో గురువారం ఉదయం సుమారు 7:30 గంటల ప్రాంతంలో గ్రామంలోని ఒక వ్యవసాయ బావిలో మల్లేష్ మృతదేహం తేలియాడుతూ కనిపించింది.బావిలో శవాన్ని గమనించిన వ్యవసాయ భూమి యజమాని వెంటనే మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దాంతో ఘటనా స్థలానికి చేరుకున్న భార్య పద్మ, ఇతర కుటుంబ సభ్యులు ఆ మృతదేహం మల్లేష్దేనని గుర్తించారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న మల్లేష్, తీవ్ర మనస్తాపానికి గురై జీవితంపై విరక్తి చెంది బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని భార్య పోలీసులకు తెలిపింది. తన భర్త మరణంపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవని ఆమె పేర్కొంది. భార్య పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇల్లంతకుంట పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహానికి పంచనామా నిర్వహించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
