కంపెనీ సొమ్ముతో షేర్ మార్కెట్ జూదం: రూ.7.90 కోట్ల మోసానికి పాల్పడ్డ అకౌంటెంట్ అరెస్ట్
రంగారెడ్డి, వి90 న్యూస్, మే 21: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని ఒక ప్రముఖ పరిశ్రమలో భారీ ఆర్థిక మోసం వెలుగుచూసింది. ఉన్నత చదువులు చదువుకుని, అకౌంట్స్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక ఉద్యోగి కంపెనీకి చెందిన కోట్ల రూపాయల నిధులను పక్కదారి పట్టించాడు. ఆర్.ఎం. కన్వర్టర్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో అకౌంటెంట్గా పనిచేస్తున్న హనుమాన్ల లక్ష్మణ్ అనే వ్యక్తి గత ఆరు నెలలుగా ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. వెండర్లకు చెల్లించాల్సిన రూ.7 కోట్ల 90 లక్షల 27,915లను వారికి చేరకుండా, రికార్డుల్లో మాత్రం పంపినట్లు అబద్ధాలు రాస్తూ తెలివిగా తన సొంత బ్యాంకు ఖాతాకు మళ్లించుకున్నాడు.ఈ భారీ మొత్తాన్ని అతడు షేర్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టి పూర్తిగా నష్టపోయాడు. ఇటీవల కంపెనీ డైరెక్టర్కు లెక్కల్లో తేడాలు రావడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన షాద్ నగర్ డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీనారాయణ, కొత్తూరు సీఐ నరసయ్యల బృందం విచారణ జరపగా ఈ మోసం గుట్టు రట్టయింది. నిందితుడి బ్యాంకు ఖాతా నుండి రూ.1 కోటి 47 లక్షలను స్తంభింపజేయడంతో పాటు, అతని వద్ద నుండి రూ.2.60 లక్షల నగదు, రెండు స్మార్ట్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి ఇలాంటి మోసాలు కొత్తేమీ కాదని, గతంలో జూబ్లీహిల్స్, చందానగర్ పరిధిలోని కంపెనీల్లో కూడా ఇలాంటి ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ శిరీష మీడియా సమావేశంలో వెల్లడించారు.
