ఇల్లందకుంటలో ముమ్మరంగా వలస కూలీల గుర్తింపు తనిఖీలు: యజమానులు వివరాలు సమర్పించాలని జమ్మికుంట రూరల్ సీఐ, ఎస్ఐ ఆదేశం
ఇల్లందకుంట,వి90 న్యూస్, మే 23: ఇటీవల పెరుగుతున్న నేరాల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకై ఇల్లందకుంట మండలంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. జమ్మికుంట రూరల్ సీఐ , ఇల్లందకుంట ఎస్ఐ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ ఇటుకబట్టీలు, ఇతర పని ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించి, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కూలీల పూర్తి వివరాలను సేకరించారు. ఇందులో భాగంగా అనుమానాస్పద వ్యక్తుల గుర్తింపును నిర్ధారించుకోవడానికి వారి వేలిముద్రలను (ఫింగర్ ప్రింట్స్) పోలీస్ సాంకేతిక పరిజ్ఞానంతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పోలీస్ అధికారులు స్థానిక యజమానులకు పలు కీలక సూచనలు చేశారు. ఇతర రాష్ట్రాల నుండి తమ వద్దకు పనుల కోసం వచ్చే కూలీల వివరాలను, గుర్తింపు కార్డులను సంబంధిత యజమానులు తప్పనిసరిగా ఇల్లందకుంట పోలీస్ స్టేషన్లో సమర్పించాలని ఆదేశించారు. ముఖ్యంగా నేపాల్ దేశం నుండి వచ్చే వారి విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటూ, వారి పూర్తి సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని, వారితో సక్రమంగా వ్యవహరించాలని సూచించారు. నేరాల నియంత్రణకు, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు, వ్యాపారస్తులు పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఈ సందర్భంగా వారు కోరారు.
