జమ్మికుంటలో అనుమతి లేని ప్రైవేటు సీసీ కెమెరాల తొలగింపు: కౌన్సిలర్ ఒగ్గు రమేష్ తక్షణ చర్య
జమ్మికుంట, వి90 న్యూస్, మే 23: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ప్రైవేటు సీసీ కెమెరాలను స్థానిక కౌన్సిలర్ ఒగ్గు రమేష్ మున్సిపల్ సిబ్బందితో కలిసి శుక్రవారం తొలగించారు. వార్డులోని రోడ్లకు ఇరువైపులా కొందరు ప్రైవేటు వ్యక్తులు దాదాపు 12 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, వాటి నియంత్రణను తమ ఇళ్లలో ఉంచుకుంటూ స్థానికుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ప్రజలు కౌన్సిలర్ ఒగ్గు రమేష్కు ఫిర్యాదు చేశారు. దీనివల్ల తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందని, మనోభావాలు దెబ్బతింటున్నాయని వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేయడంతో కౌన్సిలర్ తక్షణమే స్పందించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ ఒగ్గు రమేష్ మాట్లాడుతూ, సీసీ కెమెరాలు ప్రజల భద్రతకు, నేరాల నివారణకు మాత్రమే ఉపయోగపడాలని, అంతేకానీ ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసేలా ఉండటం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. మున్సిపాలిటీ, పోలీస్ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇలాంటి కెమెరాలు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ప్రజల హక్కులు, గోప్యతను కాపాడటం ప్రజాప్రతినిధిగా తన బాధ్యతని, భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తమ ఫిర్యాదుపై తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించిన కౌన్సిలర్కు వార్డు ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
