జేసీబీ వివాదంలో యువకుడిపై దాడి: జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ముగ్గురిపై ఫిర్యాదు
జమ్మికుంట, వి90 న్యూస్,మే 23: జేసీబీ నిర్వహణకు సంబంధించిన ఆర్థిక వివాదంలో ఓ యువకుడిపై ఇద్దరు వ్యక్తులు ఇష్టానుసారంగా దాడి చేసిన ఘటన ధర్మారం గ్రామంలో వెలుగుచూసింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, ధర్మారం గ్రామానికి చెందిన మేడి రామకృష్ణ (20, ఎస్సీ మాల) మరియు ప్రతివాదులైన మేడి మహేందర్, మేడి రమేష్, మేడి సురేష్ కలిసి 2022లో దాదాపు 60 లక్షల రూపాయల విలువైన జేసీబీని కొనుగోలు చేశారు. అయితే, అప్పటి నుండి 2025 వరకు ఆ ముగ్గురు భాగస్వాములు జేసీబీని నడుపుకుంటూ వచ్చిన లాభాల మొత్తాన్ని వారే తీసుకుంటూ, తనకు పైసా కూడా ఇవ్వకుండా మోసం చేశారని రామకృష్ణ ఆరోపించారు. ఈ విషయమై స్థానిక పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా, ప్రతివాదులు బాధితుడిని దుర్భాషలాడారు.న్యాయంగా రావాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితుడు రామకృష్ణ ఈ ఏడాది ఫిబ్రవరి 3న జేసీబీని తన ఇంటికి తెచ్చుకుని నడుపుకుంటున్నాడు. దీనిని మనసులో పెట్టుకున్న మేడి మహేందర్, మేడి రమేష్లు ఈనెల 20వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఒక ఫంక్షన్కు వెళ్లి వస్తున్న రామకృష్ణను దారి మధ్యలో అడ్డుకున్నారు. బండిపై నుంచి కిందికి లాగి, నానా బూతులు తిడుతూ చేతులతో ఇష్టానుసారంగా కొట్టారు. ఈ దాడిలో రామకృష్ణ ఎడమ కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, ఈ సంఘటన జరుగుతున్న సమయంలో స్థానికులైన తిప్పారపు రాజు, మారేపల్లి రాజేష్, గట్టు శ్రీను అనే వ్యక్తులు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నట్లు బాధితుడు పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
