జమ్మికుంటలో వడదెబ్బకు గుర్తుతెలియని యాచకుడు మృతి: జాగ్రత్తగా ఉండాలన్న మున్సిపల్ చైర్మన్ దిలీప్
జమ్మికుంట,వి90 న్యూస్,మే 24: జమ్మికుంట పట్టణంలో భానుడి భగభగలకు ఓ గుర్తుతెలియని యాచకుడు బలయ్యాడు. పట్టణంలోని కొండూరి కాంప్లెక్స్ అండర్ గ్రౌండ్ దారిలో ఎండ వేడిని తట్టుకోలేక సదరు యాచకుడు మృతి చెందాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు సమాచారం అందించడంతో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ దిలీప్, స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

వారు మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం, తదుపరి ప్రక్రియ కోసం శవాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పట్టణంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని ఆయన కోరారు.
