మధిరలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సుడిగాలి పర్యటన: అభివృద్ధి పనులపై అధికారులకు కీలక ఆదేశాలు
మధిర,వి90 న్యూస్,మే 24: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిర మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా పర్యటించి, వివిధ విభాగాల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన తొలుత మధిర మార్కెట్ యార్డ్ను సందర్శించి అక్కడి గోదాముల నిల్వ సామర్థ్యాన్ని, నిర్మాణ ప్రమాణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైరా నది పరివాహక ప్రాంత ప్రజల రక్షణ కోసం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల మేరకే నిర్మాణ సామాగ్రిని వాడాలని కాంట్రాక్టర్లను, అధికారులను హెచ్చరించారు. ముఖ్యంగా జూలై నెల ముగిసేలోపు రిటైనింగ్ వాల్కు సంబంధించిన పునాది పనులన్నింటినీ పూర్తి చేయాలని స్పష్టమైన గడువు విధించారు.

పట్టణంలోని 11వ వార్డులో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించిన డిప్యూటీ సీఎం, ఈ పనుల వల్ల స్థానిక ప్రజలకు మరియు రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డ్రైనేజీ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి, రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. ఆ తర్వాత మధిరలో అత్యున్నత సౌకర్యాలతో నిర్మిస్తున్న మోడల్ మహాప్రస్థానం పనులను పరిశీలించిన ఆయన, మధిరను ఒక మోడల్ పట్టణంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఈ సుడిగాలి పర్యటనలో ఉపముఖ్యమంత్రితో పాటు జిల్లా కలెక్టర్ దివాకర్, అడిషనల్ కలెక్టర్ శ్రీజ, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు మరియు స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
