మే చివరి నాటికి వంద శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి: ఉన్నతాధికారుల వీడియో కాన్ఫరెన్స్లో ఉపముఖ్యమంత్రి ఆదేశం
ఖమ్మం,వి90 న్యూస్, మే 24: యాసంగి ధాన్యం కొనుగోళ్లు మరియు వ్యవసాయాధారిత అంశాలపై సహచర మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో కలిసి ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ యాసంగి ధాన్యం కొనుగోళ్లను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రజా ప్రభుత్వ పాలనలో రైతులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా గంటల వ్యవధిలోనే ధాన్యం డబ్బుల చెల్లింపులు జరుగుతున్నాయని స్పష్టం చేస్తూ, మే నెల ముగిసేలోపు ధాన్యం కొనుగోళ్లను వంద శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

దీంతో పాటు ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన సన్ఫ్లవర్ పంట కొనుగోళ్లకు సంబంధించి తక్షణమే అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వాయు కాలుష్య నియంత్రణను తీవ్రంగా పరిగణిస్తూ, గ్రామాల్లో రైతులు పంట అవశేషాలను (వరి కొయ్యలను) తగులబెట్టకుండా రాబోయే 15 నుంచి 30 రోజుల పాటు విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘించి వరి కొయ్యలను కాల్చే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కీలక వీడియో కాన్ఫరెన్స్లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
